ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD MAHADEV'S ORIGINAL POETRY IN SRIKALAHASTHI MAHATYAM



ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత, మీరు చదివారా!? 
.
ధూర్జటి మహాకవి విరచిత “శ్రీకాళహస్తి మాహాత్మ్యం” లోని “నత్కీరుడి” కథ !

(ఇది ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి “పద్యకవితా పరిచయం” నుండి గ్రహింపబడినది.)



అనగనగా ఒక పాండ్య రాజు. కవి పిండిత పోషకుడు. ఆయన కొలువులో ఒక శంఖఫలకం ఉంది. పుష్పకవిమానం లాంటిది. అర్హుడైన కవి వస్తే ఎదిగి జాగా ఇస్తుంది. ఆ శంఖ ఫలకం మీద కూర్చోవడం అనే గౌరవం పొందిన ఒకానొక కవీశ్వరుడున్నాడు. నత్కీరుడు. ప్రతిదినం ఎవరో ఒకరు రావడం, కవిత్వం వినిపించడం నత్కీరాది కవీశ్వరులు తర్కించి నిగ్గు తేల్చడం, అర్హుడైతే రాజసత్కారం, అనర్హుడైతే వెనుదిరిగిపోవడం – ఇది ఆ కొలువులో జరుగుతూ ఉండే కథ. ఆ రాజ్యంలో ఒక సారి కరువొచ్చింది. ఆ ఊళ్ళో ఒక శివాలయం, అందులో ఒక అర్చకుడు. కరువు తట్టుకోలేక గుడి విడిచి, ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటూండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక పద్యం అల్లి పూజారికిచ్చి, "దీన్ని రాజు గారివద్దకు తీసికెళ్ళు, ఆయన నీకు వెయ్యి మాడలిస్తాడు, నీ కరువు తీరుతుంది" అన్నాడు..

పూజారి అలాగే రాజకొలువుకి వెళ్ళి శివుడిచ్చిన పద్యం చదివాడు.

""సిందుర రాజ గమనాధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు" అనేది ఆ పద్యానికి భావం. సిందురం అంటే ఏనుగు. గజరాజ గమనం కలిగిన ఆ స్త్రీ జుట్టుముడి (ధమ్మిల్ల బంధం) సహజ సువాసనతో అలరారుతోంది అని కవితా సారాంశం. పూజారి కొలువులో నత్కీరుడు ఉన్నాడు. ఆయన అభ్యంతరం చెప్పాడు. జడకి సహజ గంధం ఉంటుంది అని వర్ణిస్తే లోకం నవ్వదా? అన్నాడు.



తప్పిది, చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ

విప్పగిదిన్ రచింప దగునే" యన విప్రుడు చిన్నవోయి "నా

కప్పరమేశ్వరుండు వసుధాథిపుపై రచియించి యిచ్చినా,

డొప్పును దప్పు నే నెఱుగ నుత్తములార!" యటంచు గ్రమ్మఱన్

"ఓ విప్రకుమారా! ఇది తప్పు, ఇలా చెప్పరాదు. కవితా పద్ధతులకీ కవిసమయానికీ ఇది ఒప్పదు (ఒప్పుకాదు). నువ్వు ఈ పద్ధతిలో (ఈ పగిదిన్) రచించడం తగునా?" అని గద్దించేసరికి ఆ పూజారి చిన్నబోయి "ఓ ఉత్తములారా! ఈ పద్యాన్ని నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇందులోని ఒప్పూ తప్పూ నాకు తెలియవు" అని వెనుతిరిగిపోయాడు.

శివాలయానికి వచ్చి శివుడితో విషయంతా చెప్పాడు. తన భక్తుడికి జరిగిన అవమానాన్ని శివుడు తీర్చాలనుకున్నాడు. మానవరూపంలో ఆ పూజారిని వెంటబెట్టుకుని రాజు సభకి వచ్చి అంటున్నాడు.



ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ

చారు ప్రౌడిమ జెప్పి పంప, విని, మాత్సర్యంబు వాటించి, న

త్కీరుం డూరకె తప్పు వట్టెనట - యేదీ! లక్షణంబో యలం

కారంబో, పదబంధమో, రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్



ఈ రాజుగారిమీద నేను కవిత చెప్పాను. సాహిత్య సంబంధమై ప్రకాశించే మాధుర్యంతో అందమైన (చారు) ప్రౌడిమతో చెప్పి పంపించాను. అది విని మాత్సర్యం వహించి (పాటించి) నత్కీరుడుట, ఎవడో! ఊరికే తప్పు పట్టాడట! ఏదీ చెప్పండి, నా కవితలో చందోవ్యాకరణ లక్షణం తప్పిందా? అలంకారంలో దోషం ఉందా? సమాసంలో (పదబంధం) పొరపాటు జరిగిందా? రసంలో ఔచిత్యం దెబ్బతిన్నదా? దేనికి సంబంధించి ఏది తప్పిందో (తప్పినన్) చక్కగా (వెంటనే - నేరుగా) చెప్పండి. అని శివుడు నిలదీసాడు.

నత్కీరుడు మునపటిలాగే "కేశపాశాలకి సహజ గంధం ఎక్కడినుంచి వస్తుంది. ఇది లోక విరుద్ధం, కవి సమయ విరుద్ధం" పొమ్మన్నాడు.

అప్పుడు శివుడు "పార్వతీదేవి పొడవైన కేశబంధం సహజ గంధంతోనే ఉంటుంది. కాబట్టి నేను రాసినది సరియే" అన్నాడు.

నక్కీరుడు "ఆ సంగతి మాకేమి తెలుసు? ఈ లోకంలో ఉండే కాంతలకు అది వర్తించదు" అని బదులు పలికాడు. "లూలా మాలపు మాటలు చాలు" అన్నాడు. (అంటే అర్థం పర్థం లేని మాటలు; నువ్వు అదేదో చూసి వచ్చినట్లు మాట్లాడున్నావేమిటీ, వెళ్ళు! అనే వెక్కిరింత).

అప్పుడు శివుడు తన నిజరూపం చూపించాడు. అయినా సరే నత్కీరుడు అవినయంగా మాట్లాడాడు.



తల చుట్టువాఱ గన్నులు

గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే

వలదిచ్చట నీ మాయా

విలసనములు పనికి రావు విడువు" మటన్నన్



నీకు నుదిటి మీదనే కాదు తలచుట్టూరా కన్నులు ఉన్నా సరే, వాటిని కూడా చూపించినా సరే, నువ్వు రాసిన ఈ పద్యాన్ని తప్పు కాదు అనడం ఎవడి వల్లా కాదు. తప్పు తప్పే. అంచేత - వద్దు. నీ మాయా విలాసాలూ, గారడీ ప్రదర్శనలూ, ఇక్కడ పనికి రావు. చూపించకు. వాటిని వదిలేసెయ్ - అన్నాడు.

శపియించెన్ బ్రతిభాషల

గుపితుండై రుద్రు డతని "గుష్ఠు వ్యాధిం

దపియింపుము" మనుచు దానికి

నపరిమిత భయమ్ము నంది, యతడిట్లనియెన్



వెంటనే శివుడు శపించాడు. నత్కీరుడి మారు సమాధానికి (ప్రతిభాషలన్) కోపం వచ్చి శపించాడు. నత్కీరుడి ప్రతిపాదనలో దోషం లేదు కానీ, ప్రతిభాషణలో దోషం ఉంది. అహంకారం ఉంది. సామాన్యుల అహంకారంవల్ల సమాజానికి కీడు ఆట్టే ఉండదు. కానీ నత్కీరుడిలాంటి మహోన్నతులకు ఇంత అహంకారం ఉంటే లోకానికి కీడు కూడా మహోద్ధృతంగానే ఉంటుంది. అందుకని కాబోలు తీవ్రమైన శాపమే ఇచ్చాడు "కుష్ఠువ్యాదితో తపింతువుగాక" అనేసాడు.

ఇప్పటికి నత్కీరుడి కళ్ళు తెరుచుకున్నాయి. అహంకారపు పొరలూ, మోహపు తెరలూ విడిపోయాయి. అపరిమితంగా భయపడిపోయాడు.



స్వామీ! ద్రోహము జేసితిం, దెలుపవే శాపాంత ముద్యత్కృపా

ధామా! నా" కనుచున్ బదాబ్జములమీదం బడ్డ, నా భక్త ర

క్షామందారుడు శాంతి బొంది, యనియెం "గైలాస శైలంబు గం

టే మానుం బద" మన్న నందులకు దా డెందంబునం గుందుచున్



ఓ స్వామీ! ద్రోహం చేసాను క్షమించు. ఓ కృపాధామా (దయాలవాలా!) శాపవిమోచన మార్గం ఏమిటో (శాపాంతంబు) తెలుపుమా నాకు - అంటూ పాదపద్మాల మీద పడ్డాడు.

శివుడు భోళా శంకరుడు. భక్తరక్షణకు కల్పవృక్షం (మందారం). వేంటనే శాంతించాడు. "కైలాసాన్ని దర్శించినట్టయితే నీ కుష్ఠురోగం మానిపోతుంది. అదే శాప విమోచన. బయలుదేరు (పద)!" అన్నాడు. పాపం నత్కీరుడు హృదయంలో పరితపించాడు.



ఈ కవితాభిమానము వహించితి నేటికిన్? శంఖ పీఠిపై

ఈ కవులున్నయట్లు వసియింపక దేవునితోడ నేల చా

ర్వాక మొనర్చితిం? గడు భరంబగు కుష్ఠ రుజా విషాద మే

నే కరణిన్ ధరించు? నిక నెన్నడు చూచెద వెండి గుబ్బలిన్!



చార్వాకము = అప్రామాణికమైన మొండివాదన. ఏ కరణిన్ - ఏ విధంగా. వెండి గుబ్బలి - వెండికొండ.



ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రములెన్ని, బోయ వీ

ళ్ళెన్ని, మృగంబు లెన్ని, జన హీనములైన పథంబులెన్ని, నే

నిన్నియు దాటి, యే కరణి నీశ్వరు శైలము చూడ బోయెదన్!

గన్నది కాదు విన్నయది కాని, సదాశివ! యేమి సేయుదున్ !



ఈశ్వరనివాసమైన కైలాసాన్ని ఎలా వెళ్ళి చూడటం! ఎప్పుడూ ఎవ్వరూ వెళ్ళింది కాదు. చూసింది కాదు. కాకపోతే విన్నాం. ఉత్తర దిక్కున ఉంది అనీ, అదే శివుడికి ఆవాసమూ అనీ, పెద్దలు చెప్పగా విన్నదే కానీ, కన్నది కాదు. ఓ సదాశివా! (ఎల్లవేళలా శుభప్రదుడా!) ఏమి చెయ్యను స్వామీ! దారిలో ఎదురయ్యే అడవులూ, కూరమృగాలూ, రాక్షసులూ, మధ్యలో జనులు ఉండని (జనహీన) ప్రదేశాలెన్నో! దగ్గరవుతున్న కొద్దీ పెను మంచు వానలూ, కాళ్ళకి గాయాలు చేసే రాళ్ళూ రప్పలూ - ఆ దారుల్లో ప్రయాణం చెయ్యడం శక్యమా! ఎలాగ, స్వామీ!



అనుచు జింతా పరంపర లనెడు వర్ష

ముడిగి, నత్కీరు డను మేఘు డుత్తరంబు

నడచె, సంతోషమున దక్షిణమున నున్న

కవుల ముఖ పంకజములు వికాస మొంద



తన చింతాక్రాంతమైన అలోచనా పరంపరలు అనే వర్షధారల్ని చాలించుకుని (ఉడిగి), నత్కీరుడు అనే మేఘుడు ఉత్తర దిశకు నడిచాడు. ఇక దక్షిణ దిక్కున నత్కీరుడు లేడు. వర్షాకాలం వెళ్ళిపోయి, శరత్కాలం వస్తే ఎంత తెరిపిగా ఉంటుందో - అంత తెరిపిగా ఉంది దక్షిణ దేశం. దక్కిణ దిక్కున ఉన్న కవుల ముఖ పద్మాలు సంతోషంతో వికసించాయట. శరదృతువులో పంకజాలు వికాసం పొందినంత ఆనందం దక్షిణాపథ కవుల ముఖాల్లో కనబడుతోంది. నత్కీరుడు వెళ్ళిపోయాడంటే - పీడ విరగడయ్యిందిరా, భగవంతుడా అని తక్కిన కవులంతా సంతోషించారని. ఇది ఆ కవుల మాత్సర్యాన్ని తెలీజేయడంకన్నా నత్కీరుడి అహంకారాన్నీ దౌష్ట్యాన్నీ తెలియజెబుతోంది. వాళ్ళని అంతగా ఏడిపించుకుతన్నాడన్నమాట. ఇది నత్కీరుడి సహజ లక్షణమన్నమాట. అదే దూకుడు శివుడిమీదా చూపించాడు. ఫలితం అనుభవించాడు.



నానా కష్టాలు పడి వెళుతోంటే, కుమార స్వామి ప్రత్యక్షమై "శివుడు కైలాసం చూడ మన్నాడే కానీ ఉత్తర దిశా కైలాసం అనలేదు కదా. అంచేత దక్షిణ కైలాసం చూచినా చాలు. కుష్ఠురోగం మానిపోతుంది" అని చెబుతాడు. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం. దాని సందర్శించి నత్కీరుడు శాపవిముక్తుడయ్యాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

అప్పటికి నత్కీరుడి అహంకారం పటాపంచలు అయ్యింది. ఙ్ఞానోదయంతో అడిగాడు -

ఈ సంసారము, దుఃఖా

వాసానందంబు, దీని వర్జింపంగా

నే సుఖము గలుగు దయ న

న్నా సుఖమున గూర్పవే ! కృతార్థుడ నగుదున్


అప్పుడు శ్రీకాళహస్తి పుర దైవం సంతోషించి ఆ కవికి సాయుజ్యం అనుగ్రహించాడు.