ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BIRTH STORY OF THRILOKA SANCHARI NARADHA MAHA MUNI IN TELUGU


 నారదుని పూర్వజన్మ వృత్తాంతము

సీ. విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును
లేదు విశ్వమునకు
భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీ వెఱుంగుదుగాదె నీ ముఖమున
నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము కావున హరిపరాక్రమములెల్ల

ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.

నారద మహర్షి వ్యాకులతతో ఉన్న వ్యాసునితో ఇంకా ఇల్లా చెప్పసాగాడు......"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వాంతరాళంలో లేదు.సర్వ సృష్టి,స్థితి,వృద్ధి,లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై విష్ణ్వంశతో జన్మించినాడవు..కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు..ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ,సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!

మహాత్మా! నేను నా పూర్వజన్మలో(ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవాదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకచోట నిలిచి ఉండే యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు ఒక్కచోట కదలకుండా ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.) నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు బాలురవలే ఆటలకు వెళ్ళక, ఏ ఇతర జంజాటాలు లేకుండా భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి శుభంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల,శరత్కాలాలు సేవించాను.వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ,పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి.మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది.దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను.అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.....

కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు...అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో,కరుణతో నాకు అతిరహస్యమైన ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశం వల్ల ఆ వాసుదేవుని సర్వ మాయావిలాసాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు ఈశ్వర సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి.వాటిని ఈశ్వరార్పితంగా భావించి ఆచరించాలి. అప్పుడు భక్తియోగం కలుగుతుంది. ప్రణవ సహితంగా వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అనే ఈ నాలుగు నామాల్ని భక్తి పూర్వకంగా పలికి, నమస్కారం చేసి, మంత్రమూర్తియైన ఆ యజ్ఞపురుషుని పూజించిన వాడు సమ్యగ్దర్శనుడౌతాడు.నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి తనయందలి పరమేశ్వర జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసితినని, ఆకొంటినని నాకు అన్నమిడి, నన్ను ముద్దాడి, చుంచు దువ్వి, నన్ను కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరెడిది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా,అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి విగతజీవియై వెంటనే నేలకూలింది.అది చూచి నేను మోహం పొందక, సంసారబంధాలు తొలగిపోయాయని భావించి,విష్ణుపద ధ్యానంమీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను.అలా బయలుదేరి, పట్టణాలు,జనపదాలు,పల్లెలు,నదులు,పర్వతాలు,అడవులు దాటి సర్వజంతు వాసితమైన ఒక భీకరారణ్యం ప్రవేశించాను.అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని,హరిని చింతించాను.అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది.కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు.ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు.ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరిలోకి అగ్రగణ్యుడవై వర్ధిల్లుతావు."

అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచి నమస్కరించితిని. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ,విషయవిరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా,ఈ పాంచభౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను.అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణమూర్తి యొక్క నాభికమలగతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను.తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై,బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను.అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనమిస్తుంటాడు.మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది.అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళాడు అని సూత మహర్షి చెప్పి ఇలా అన్నాడు.

"వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! "

లోకాఃసమస్తాస్సుఖినో భవంతు.