ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT CHITRAGUPTA TEMPLES IN INDIA


చిత్రగుప్తుని దేవాలయాలు

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..

యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో, ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.

ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.

దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంగాచార్యులు చెప్పారు. అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.