ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KUREKSHETRA WAR STORIES OF MAHABHARATHA IN TELUGU - FIGHT STORY BETWEEN BHIMASENA AND DUSYASANA - HOW BHIMASENA KILLED DUSYASANA IN THE WAR


భీముడు దుశ్శాసనుడిని వధించుట

ఇంతలో దుశ్శాసనుడు భీమునితో తలపడ్డాడు. భీముడు " తమ్ముడా దుశ్శాసనా ! నాడు కౌరవ సభలో నాడు కురుసభలో నీవు చేసిన అకృత్యములకు వడ్డితో సహా ముట్టచెప్పడానికి తరుణం వచ్చింది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. అందుకే భగవంతుడు నిన్ను నా ఎదుట నిలబెట్టాడు " అన్నాడు. దుశ్శాసనుడు హేళనగా నవ్వుతూ " ఓ భీమసేనా ! ఏమిటీ అప్పుడే మరిచావా ! మేము మిమ్ము లక్క ఇంట్లో పెట్టి తగులబెట్టడం, నీ అన్నతో మాయా జూదం ఆడించి మీ రాజ్యం కొల్లగొట్టడం, మిమ్ము అడవులకు వెళ్ళ గొట్టడం, దిక్కులేని వారి వలె మీరు విరాటరాజు కొలువులో తలదాచు కోవడం మరిచావా ! ఇంతకంటే దైన్యమూ అవమానం ఉంటాయా ! ఇన్ని జరిగినా తగుదునమ్మా! అని యుద్ధానికి వచ్చావా ! అవన్నీ మీరు మరిచినా ! నేనెలా మరువ గలను " అన్నాడు దుశ్శాసనుడు. ఆ మాటలకు బదులుగా భీముడు దుశ్శాసనుడి కేతనమును, వింటిని విరిచి, సారధిని చంపి దుశ్శాసనుడి నుదుటన బాణం నాటాడు. తన రధము తానే నడుపుతూ దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని భీముని విల్లు విరిచి భీముని సారధిని కొట్టాడు.

భీముడు మరొక విల్లు తీసుకుని దుశ్శాసనుడి శరీరంలో ఏభై బాణములు నాటాడు. వెంటనే దుశ్శాసనుడు భీముని రధాశ్వములను చంపాడు. భీముడు తన గధ చేతబట్టి రధము మీద నుండి కిందకు దూకి దుశ్శాసనుడి రధము దగ్గరకు వచ్చి రధాశ్వములను చంపి, రధమును విరిచాడు. దుశ్శాసనుడు కూడా గధ చేత పట్టి తటాలున రధము దిగి భీముని మీద తోమరం వేసాడు. భీముడు ఆ తోమరాన్ని విరిచాడు. దుశ్శాసనుడిని దగ్గర నుండి చూడగానే తాము పద మూడేళ్ళు పడిన పాట్లు గుర్తుకు వచ్చి కోపంతో రగిలి పోయాడు. నాడు కురుసభలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది. తన బలం అంతా కూడగట్టుకుని దుశ్శాసనుడి తల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు కింద పడిన దుశ్శాసనుడి మీద పడ్డాడు భీముడు. దుశ్శాసనుడి మెడ మీద కాలు పెట్టి నులుముతూ " ఒరేయ్ దుశ్శాసనా ! నాడు కురుసభలో మమ్ము అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెదుకుతూ వచ్చావా ! ఈ రోజు నీ చావు తప్పదు " అంటూ దుశ్శాసనుడి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఉభయ సేనలూ భయభ్రాంతులతో చూస్తూ దూరంగా పోయాయి.

భీముడు దుశ్శాసనుడి శరీరాన్ని పైకెత్తి పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి బాదాడు. దుశ్శాసనుడి శరీరాన్ని కాలితో ఎగసి ఎగసి మోదసాగాడు. దుశ్శాసనుడి మెడ మీద మోకాలు పెట్టి అదిమి పైకి లేచాడు. దుశ్శాసనుడు బ్రతికున్నాడో చచ్చాడో చూడక వికట్టాట్టహాసం చేస్తూ మోకాళ్ళ మీద కూర్చుని " ఒరేయ్ దుశ్శాసనా! ఈ రోజు నీగుండెలు చీల్చి నీ రక్తం తేనెలా తాగుతాను. పిలవరా ! నీ వాళ్ళను పిలువు ఎవరు అడ్డం వస్తారో చూస్తాను " అంటూ ఒక గండ్రగొడ్డలి తీసుకుని దుశ్శాసనుడి ముఖం మీద ఆడించాడు. ఆ తరువాత నాడు హిరణ్యకశిపుని పొట్టను నరసింహస్వామి చీల్చినట్లు అమిత రౌద్రంతో దుశ్శాసనుడి గుండెలలో తన గోళ్ళు జొనిపి చీల్చాడు. దుశ్శాసనుడి గుండెల నుండి రక్తం పెల్లుబికింది. ఆ రక్తం దోశిలితో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీర మంతా పూసుకుని తిరిగి దుశ్శాసనుడి ముఖంలోకి చూస్తూ వికట్టాట్టహాసం చేస్తూ పైకి లేచి పూనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ " ఒరేయ్ దుశ్శాసనా ! నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా ! ఈ రోజుకు నా దాహం తీరింది. నా ప్రతిజ్ఞ నెరవేరింది " అంటూ అరుస్తున్నాడు. గంతులు వేస్తూ భుజాలు చరుచుకుంటున్నాడు. అతడు మానవుడా ! రాక్షసుడా ! అని అక్కడ ఉన్న వారికి భ్రమ కలిగి శిలా ప్రతిమలవలె నిలిచారు.

భీముడు పైకి లేచి నిలిచాడు.శరీరం రక్తమయమై ఉంది. ప్రళయకాల యముని వలె విజృంభించి కౌరవసేనలను తరమ సాగాడు. భీముని చూసి కౌరవసేనలు పారిపోయాయి. భీముడు తిరిగి దుశ్శాసనుడి వద్దకు వచ్చి " ఒరేయ్ పశువా ! అలా పడి ఉన్నావేమి. పిలవరా నన్ను అడ్డుకునేవాడేవడో పిలువు " అని అంటూ దుశ్శాసనుడి ముందు కూర్చుని " ఒరేయ్ పశువా ! నా మీద మీకు అంత కోపం ఎందుకురా ! నేను మీకు చేసిన అపకారమేమి ? నాకు విషం పెట్టారు, నీళ్ళలో తోసారు, పాములచేత కరిపించారు. అందరి ముందు మమ్ము అవమాన పరచింది, ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చింది ఇందుకేనా ! నాడు మాయా జూదం ఆడించి నందుకు ఫలితం ఇదేరా ! అనుభవించు " అంటూ పైకి లేచాడు. తనకు దగ్గరగా వస్తున్న కౌరవయోధులను చూసి " చూడండి ఈ దుశ్శాసనుడి దుర్గతి. వీడి వలన వీడి తండ్రి ధృతరాష్ట్రుడు పరువు పోగొట్టు కొని అవమాన పడ్డాడు. నాడు కురుసభలో ముందుగా మందలించి ఉండిన ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ! ఒరేయ్ నాడు కురు సభలో ద్రౌపదిని చూసి " నీకు మగడు లేడు అన్నావు కదా ! ఇప్పుడు చూడరా ! ద్రౌపదికి భర్త ఉన్నాడురా ! నేనేరా ద్రౌపది భర్తను. కానీ మీకౌరవుల భార్యలందరికీ భర్తలు లేకుండా చేస్తానురా ! వారు తమ భర్తల కొరకు భోరున ఏడవాలిరా ! ఒరేయ్ దుశ్శాసనా ! నా ప్రతిజ్ఞ ఒకటి నెరవేరిందిరా ! నీ అన్న సుయోధనుడి తొడలు విరిచి తల తన్నడం మిగిలింది ఆ ప్రతిజ్ఞ నెరవేర్చు కొనుటకు పోతానురా ! " అంటూ ఉంగిపోతూ దుశ్శాసనుడి శరీరాన్ని గధతో మోది చిత్రవధ చేసాడు.

పరస్త్రీని అవమానించి నందుకు ఏమి శాస్తి జరుగుతుందో లోకానికి చాటుతూ దుశ్శాసనుడు మరణించాడు. భీముని భయంకర ఆకృతి చూసిన కర్ణుడు సుయోధనుడు భయంతో కంపించారు. ఎవరికీ కాలూ చేయీ ఆడలేదు. కాని ధృతరాష్ట్ర కుమారులైన కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్ధ్రహుడు, అలోపుడు, సహుడు, వాతవేగుడు, షండుడు, సువర్చనుడు భీమసేనుడిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు పది భల్లబాణాలతో వారి తలలు తుంచాడు. అది చూసిన కర్ణుడు దిక్కు తోచక అటూ ఇటూ చూస్తున్నాడు.