ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THIRUPPAVAI PASURAMU - 29TH DAY IN TELUGU


తిరుప్పావై - 29
శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు - శిత్తమ్ శిఱుకాలే - అంటే బాగా తెల్లవారకుండానే ఇంకా చీకటి ఉంటూ ఉండగానే తెల్లవారుఝామున; వంద్ - అనగా వచ్చి మిమ్మల్ని సేవించి నీయొక్క పాదాలని కీర్తించి మేము పాడుతూన్నాం.

పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ - లేత తామరల వంటి నీపాదాలను కీర్తిస్తూ మంగళ శాసనాలను చేస్తూన్నాం. ఇక్కడ చెప్పినప్పుడు బాగా తెల్లవారకుండానే రావడం అంటే అర్థం ఏమిటి? అనగా అంతర్ముఖమైనటువంటి ధ్యాన స్థితి అని మనం ముందే చెప్పుకున్నాం. అంతేకాదు భగవత్ సాధనకు కావలసినది ఏమిటి అంటే తపన. ఆ తపన ఏమిటి అంటే తెల్లవారకుండానే నిద్రలేచి వెళ్ళడం అనేది తీవ్రమైన శ్రద్ధను తెలియజేస్తుంది. అదే కావాలి అనే లక్ష్య శుద్ధిని, ఏకాగ్రతని తెలియజేస్తున్నది. స్వామియొక్క అందమైన పాదములు తలంచుకోగానే తల్లి చెప్తున్నది

పొత్తామరై యడియే - అన్నదిక్కడ. అంటే క్రొత్త తామరలవి. సుందరమైనటువంటి తామరపువ్వులను పోలినటువంటి నీ పాదాలకు మేమిప్పుడు మంగళాశాసనములు చేస్తున్నాం. చక్కటి మాటలు ఇక్కడ. భగవంతుణ్ణి కీర్తించిన దానికి ఫలితం ఏమిటి? అమ్మ కోరుకుంటున్నది ఏమిటి?

పోట్రుం పొరుళ్ కేళాయ్

పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు - ఓ స్వామీ! నువ్వు ఈ గోపవంశంలో అవతరించావు. ఎలాంటి గోపవంశం అంటే పశువుల్ని మేపుతూ పోషించుకుంటున్నటువంటి లేదా పశువుల్ని మేపుతూ బ్రతుకుతున్నటువంటి గోపవంశంలో అవతరించిన నీకు మేమిచ్చేటటువంటి కైంకర్యాలు తగదు అనరాదు అన్నారు. మేము మీ నుంచి కోరుకుంటున్నది

ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా! - నీనుంచి మేము పరం తీసుకోవడానికి వచ్చిన వారము కాదు. మొదటి నుంచీ ఏమున్నది? పరవాద్యమును ఇవ్వు అనేటటువంటిది శ్రీవ్రత ఫలంగా చెప్పినది. కానీ పరవాద్యం ఇమ్మని మాట వరుసకి అన్నానే కానీ కేవలం పరవాద్యం కాదు నాకు కావలసినది. మరేం కావాలి? ఇక్కడ పరవాద్యం అంటే మనం చెప్పుకున్నాం. మోక్షమని, పరమార్థమని. కానీ అంతకంటే గొప్పమాట ఒకటి చెప్తున్నది ఇక్కడ. భక్తులు మోక్షం కావాలి అని కూడా అనరు. మోక్షం కంటే గొప్పది అంటే ఏంటి అంటే "నమోక్షస్యాకాంక్షా" అన్నారు కదా మహానుభావులు కులశేఖరఆళ్వారులు. మోక్షాకాంక్ష కూడా భక్తులకి ఉండదు. వాడికి కావలసింది భగవంతునితో నిత్య సంబంధం. నిరంతరం మనస్సు ఆ మాధవుడితో తన్మయం చెందాలి. అది ఒక్కటి చాలు. అంతేకానీ నాకు జన్మరాహిత్యం కావాలి, జననమరణ పరంపర వద్దు అని కూడా భక్తుడు అడగడు. అందుకని ఆ పరమివ్వు అని కూడా నేను అనను. నాకు కావలసింది ఏంటి అంటే ఎప్పటికీ

ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నోడుత్తోమేయావోం - అనగా ఎప్పటికైనా ఎన్నెన్ని జన్మలకైనప్పటికీ కూడా నీతో విడదీయరాని బంధము కావాలి. ఇది చాలా చక్కటి కోరిక. అంటే జన్మలు వచ్చినా ఫరవాలేదు అనేటటువంటి ధైర్యం భక్తుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే శరీరం ఎలా ఉంటే ఏమున్నది? ఉపాధి ఎలా ఉంటే ఏమున్నది? మనస్సు నీపాదాలపై ఉన్నప్పుడు ఏ జన్మ వస్తే ఆ జన్మే కైవల్యము. కనుకనే శరీరం లేకపోవడమో, జన్మ లేకపోవడమో మోక్షం కాదు. మనస్సు పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అందుకు నీలో లయమై తన్మయమైనటువంటి స్థితి ఏ జన్మ వచ్చినా ఫరవాలేదయ్యా అదీ చెప్తున్నారు ఇక్కడ. పైగా

ఉనక్కే నాం అట్చెయ్ వోం - నిరంతరం నీకు కైంకర్యం చేసుకోవాలి. కైంకర్యము అంటే మనం చేసే ప్రతి పనీ భగవదర్పణంగా భగవత్ ప్రీతిగా చేయడమే కైంకర్యము. అది మాయొక్క అన్ని కోరికలను పోగొట్టుగాక! చిత్రం. కోరికలు తీర్చుగాక అనలేదు. కోరికలను పోగొట్టుగాక అన్నారిక్కడ. అందుకే భగవత్ కామం ఎటువంటిది అంటే భగవంతుణ్ణి కోరుకోవడం కోరిక కాదుట. ఎందుకంటే "స న కామయమనా నిరోధ రూపత్వాత్" అంటున్నారు నారదుల వారు. అది కోరిక కాదు. భక్తి కామిని కాదు. కోరుకొనేది కాదు. ఎందుకంటే అన్ని కోరికలూ ఎక్కడ ఆగిపోతాయో ఆ కోరిక భగవత్కామం. మోక్షమే అది. అందుకు అన్నీ భగవంతుడే. అదే సంబంధం. లోకంలో మనకి ఎన్నో సంబంధాలుంటాయి. తల్లి, తండ్రి, పుత్రులు, భార్య, స్నేహితులు ఇంకా శత్రువులు రకరకాల బందాలుంటాయి. కానీ తీయనైన ప్రగాఢమైన అనుబంధం భగవంతుడితోటే ఉండాలి. అందుకే "మాతా పితా భ్రాతా నివాస శరణం సుహృత్ గతిః నారాయణ ప్రభుః" అని శాస్త్రం చెప్తున్నది. సర్వమూ నారాయణుడే. ఇది శ్రీవ్రత ఫలంగా తల్లి చెప్పినటువంటి గొప్ప మాట.